3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ!
- ఎకరం ప్రభుత్వ విలువ రూ.1.75 లక్షల నుంచి రూ.2.75 లక్షలకు
- ఓపెన్ ప్లాట్ల కనిష్ఠంగా రూ.15 లక్షలు
- అపార్ట్మెంట్లలో చదరపు అడుగు రూ.6 వేలు
3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ! ఈ నెల 28 నుంచి అమలుకు సన్నాహాలు
హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువను మూడు రకాలుగా సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ, ప్రధాన రహదారులు, మండల కేంద్రాలు, పట్టణాలకు సమీపంలోని భూముల విలువలను సవరించనున్నారు.
బాహ్య వలయ రహదారి (ORR) లోపల ప్రాంతాల్లో భూముల ధరలు, మార్కెట్ విలువను ఆధారంగా తీసుకొని మార్పులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ విలువలు పెరగనున్నాయి. మెట్రో ప్రభావం ఉన్న ప్రాంతాలు, సాగు, సాగేతర, ఇతర భూముల విలువల్లో కూడా సవరణలు చేయనున్నారు.
ఈ నెల 28 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకురావాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రి స్థాయిలో దీనిపై సమీక్షలు కొనసాగుతున్నాయి.
వాణిజ్య ప్రాంతాల్లో:
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాణిజ్య ప్రాంతాల్లో భూముల సవరణ ఒకే తరహాలో ఉండబోదని తెలుస్తోంది. ప్రస్తుతం ధరలు బిజీ ప్రాంతాల్లో చదరపు గజానికి రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు ఉన్నాయి.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిష్ఠంగా రూ.7,800 వరకు ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం విలువను రూ.6,600 చేయాలని భావిస్తున్నారు. 100 అడుగుల రోడ్డు, ఇతర అనుసంధాన రోడ్లు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.